Sunday, December 16, 2012

International Tea Day,ఇంటర్నేషనల్‌ టీ డే

  •  
  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 15) -ఇంటర్నేషనల్‌ టీ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మొదటి అంతర్జాతీయ టీ డే డిసెంబర్ 2005 15 న్యూ ఢిల్లీ లో జరుపుకున్నారు మరియు రెండవ అంతర్జాతీయ టీ డే ఉత్సవాలు 2006 డిసెంబర్ 15 శ్రీలంక లో జరిగాయి.

 దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భా రత దేశం ఉత్పత్తి అయ్యే టీ వైవిధ్యానికీ, విశిష్టత కూ ప్రసిద్ధి పొందింది. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం
జీవితంలో ఓ అంతర్భాగ మైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మెంటల్‌ రిలీఫ్‌ కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్‌ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్‌ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విదుడల కావడం, టీ కి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి తగు మాత్రపు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది. నేడు టీ కాచుకోని ఇల్లు భారతావనిలో లేదంటే  అతిశయోక్తి కాదు... అలాంటి అమృతపానీయం కోసము  ‘ఇంటర్నేషనల్‌ టీ డే’ గా ప్రతి సంవత్సరము డిసెంబర్ 15 న జరుపుకుంటారు.


 పశ్చిమ బెంగాల్‌ లోని డార్జిలింగ్‌ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యం గా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల, ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధి స్తుంది. భారతదేశంలో టీ 
వ్యవసాయం ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధిని కల్గి స్తోంది. ఈ రంగంలో సుమారు ఇరవై లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ ఆధారపడి జీవిస్తు న్నారు. వీరిలో 50 శాతం స్ర్తీలు కావడం విశేషం.

నేడు టీ కొట్టు లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటికి ఎవరొచ్చినా వెనకటి రోజుల్లో ‘‘దాహం పుచ్చుకొంటారా?’’ అంటూ మంచినీళ్లో, మజ్జిగో  అందించేవారు. ఈ రోజుల్లో అలాకాదు. ఇంటికి ఎవరొచ్చినా ముందు కాఫీయో టీయో ఇవ్వటం మర్యాద! మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే టీ దుకాణంలేని ప్రదేశం ఉండదు. చిన్న గ్రామం మొదలు మహా పట్టాణాలవరకు ప్రతిచోటా టీ బడ్డీలు ఉంటాయి. టీ లేకుండా పార్టీలుండవు. నలుగురిని ఒకచోట పిలవాలంటే మనం ఏర్పాటుచేసేది టీ పార్టీ. సమావేశాల్లో, క్రికెట్‌ పోటీ లలో కూడా మధ్యలో టీ బ్రేక్‌ ఉంటుంది. అతిథులు ఇంటి కి వచ్చినప్పుడు  చేసే సత్కారంలో టీ తప్పనిసరి.

టీ పానీయాన్ని టీ ఆకులు, టీ లేత చిగుళ్ళు, లేత కొమ్మల నుండి కాస్తారు. కోసిన టీ అకులను ప్రొసెస్‌ చేస్తారు. ఏ మేరకు ప్రోసెస చేశారనేదాన్ని బట్టి టీ ఆకులు భిన్నంగా ఉంటాయి. రుచిగూడా భిన్నంగా ఉంటుంది. టీ వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టుకోదు. కొలెస్టరాల్‌ ను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను
ఉత్తేజపరుస్తుంది. టీలోని విటమిన్లు, లవణాలు, మిథైల్‌ గ్జాంతైన్‌ లు ముసలి వయసు లక్షణాన్ని త్వరగా రాకుండా చేస్తాయి. ఈ పానీయం తాగేవారికి వైరల్‌, బాక్టీరియా వ్యాధులు అంత సులభంగా సోకవు. టీ లో ఉన్న యాంటియాక్సిడెంట్స్‌ కాయగూరలలో కూడా దొరకవు. మూడు దశాబ్దాల క్రితం మెంటల్‌ రిలీఫ్‌ కోసం కాఫీ తాగం అలవాటుగా ఉంటే, చాయ్‌ జన సామాన్యంలో అధిక వినియోగం ఏర్పడటం, పైగా అది అందరికీ అందుబాటు ధరల్లో ఉండటం సామాన్యుడికి కూడా దగ్గర య్యింది. దీనికి పేద... ధనికుడన్న తేడా లేదు. ఎవరు తాగినా ఒకే కిక్కు. అసలు చాయ్‌ గొంతు లో పడగానే నవనాడులు స్పంది స్తాయి. దీని రుచి సంగతి తెలిసే... దేశంలో దాదాపు 70 శాతం మంది టీ తాగుతున్నారని ఓ సర్వేలో తేలింది. అందుకే త్వరలో చాయ్‌ మన జాతీయ పానీయంగా గుర్తింపు పొందనుంది. దేవుడు అందరికీ అమృతం అందించాడు. అదే మన చాయ్‌. అస్సాంలో మొదటిసారి  తేయాకు సాగు చేసిన మణిరామ్‌ దేవన్‌ 212వ జయంతిని పురస్కరించుకుని చాయ్‌కు జాతీయపానీయ హోదా కల్పించనున్నారు.

  • చాయ్‌ చరిత్ర...
4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు తేయాకు ఆకులను తుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు ద్రావకాన్ని వైద్య పరీక్ష కోసం త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవనం ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ,  ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే. 15వ శతా బ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమ య్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్‌ ఇండియా కంపనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, అనధికార యుక్తంగా నల్ల మందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది.

-చాలాకాలం తర్వాత 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్‌ సోదరులు అస్సాంలో దేశీయంగా టీని కనిపెట్టి నప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ ప్రవృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొ న్నారు. కొండ ప్రదేశాలలో ప్రజలు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838 లో డిబ్రుఘర్‌ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్‌ టీ సౌచోంగ్‌, పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపో యినప్పుడు ఇంగ్లాండ్‌... భారతదేశంలో టీ ఉత్పాదన కు తీవ్ర ప్రయత్నా లు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్‌ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు ఒక మిల్లియన్‌ కేజీలు ఉండేది.

చైనా నుండి బ్లాక్‌, గ్రీన్‌ టీ రకాల్‌ విత్తనాలను లార్డ్‌ మెకార్డెనీ తెప్పించి భారతదేశంలో 1793లో కలకత్తా బొటానికల్‌ గార్డెన్స్‌లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్‌ కచార్‌, నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందిన వే. ఆ తరువాత  అనతికాలంలో 1860కి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రవృద్ధి పొందిం ది. నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రా ష్ట్రాలు భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలు గా ప్రసిద్ధిపొందాయి. ఇవి మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. భారతదేశపు టీ
ఉత్పాదక ప్రదేశా లలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. సతతహరితపు మొక్కైన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది.

ఒక్కో దేశంలో ఒక్కోలాగ...
చైనా, జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవంగా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్‌ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం, బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్‌ టీని ఉప్పు, యాక్‌, వెన్నతో  కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్‌ లేక గ్రీన్‌ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరులు త్రాగుతారు. ఇది చాలా పుష్టికరమైన రుచికరమైన పానీయం.

  • టీ ని  జాతీయ పానీయం..!
గత పదేళ్లలో టీ వాడకం బాగా పెరిగింది. తాజా సర్వేల ప్రకారం భారతదేశంలో ప్రతీ మనిషి రోజుకో కనీసం వంద మిల్లీలీటర్లు టీ తాగుతున్నాడు. అంటే దేశ వ్యాప్తంగా రోజుకు పన్నెండున్నర కోట్ల లీటర్ల టీ  తాగేస్తున్నాం. ఒక్కో టీ తయారీకి రెండు గ్రాముల చాయ్‌పత్తా పడుతుంది. అంటే రోజుకు మనదేశంలో 25 లక్షల కిలోల టీ పొడి వాడుతున్నాం. అందుకే భారత ప్రభుత్వం టీని జాతీయ పానీయంగా గుర్తించింది. వచ్చే ఏడాది నుంచి మన జాతీయ పానీయం టీ. అస్సాంలో మొట్ట మొదటి తేయాకు మొక్క నాటిన మణిరామ్‌ దివాన్‌ 212వ జయంతిని పురస్కరించు కుని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 17న టీని జాతీయ పానీయంగా ప్రకటించనున్నారు. ఐదువేల ఏళ్లకు పూర్వం జౌషధ మొక్కలా మనదేశానికి ఉపయోగపడిన తేయాకు ఇప్పుడు ద్రావకం రూపంలోనూ ఆరోగ్యాన్ని కాపాడుతోంది. అలాంటి ''టీ'' ఇప్పుడు మన జాతీయ పానీయం అవుతున్నందుకు గర్వపడదాం...
  • అస్సాం టీ...
అస్సాం టీ ఇదో బ్లాక్‌ టీ భారతదేశంలోని అస్సాం లోని ప్రాంతం పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. బంగ్లాదేశ్‌, బర్మా (మయన్మార్‌) సరిహద్దుల్లో బ్రహ్మపుత్ర నది పరివా హక ప్రాంతంలో వున్న అస్సాం ప్రపంచంలోనే అత్యధికం గా చాయ్‌ పండించే ప్రదేశంగా ఖ్యాతి గాంచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ఆర్ధ్రత
ఉండటంతో పాటు వర్షాకాలంలో రోజుకి 10-12 అంగుళాల (250 300 మి.మీ) వర్షపాతం  నమోదవుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 103 ఫారెన్‌ హీట్‌ (40 డిగ్రీ సెంటి గ్రేడ్‌) వరకు వుండటంతో ఎక్కువ వేడి, తేమ నెలకొని గ్రీన్‌ హవుస్‌ లాంటి పరిస్థితులు ఏర్పడ తాయి. ఈ తరహా వాతావరణ పరిస్థితులు అస్సాం ''టీ'' కి విశిష్ట రుచిని ఆపాదించాయి. అస్సాం చాయ్‌ని కామేలియా సినెన్సిస్‌ వార్‌ అస్సామికా (మాస్టర్స్‌) అనే మొక్క ద్వారా రూపొందుతుంది. సము ద్రమట్టం ఎత్తులో పండించే ఈ తేనీరు తన విశిష్ట రుచి, సువాసన, పొడి బారుతనం, ఘాడత్వానికి ప్రసిద్ధి. అస్సాం టీ లేదా దాని ఉత్పత్తులను అల్పాహార  టీ గా విక్రయిస్తారు. దీన్ని ఇంగ్లీష్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ టీ, ఐరిష్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ టీ, స్కాటిష్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ టీ అని కూడా పిలుస్తారు. ప్రధానంగా అస్సాం బ్లాక్‌ టీకి ప్రసిద్ధి కానీ ఇక్కడ దీంతో పాటు గ్రీన్‌, వైట్‌ టీల ను కూడా కొద్ది మొత్తంలో పండిస్తారు. వీటి రుచులు వీటికే ప్రత్యేకం.

చారిత్రకంగా చూస్తే టీ పొడి ఉత్పత్తులలో దక్షిణ చైనా తరు వాత అస్సాందే రెండవ స్థానం. ప్రపంచంలో దక్షిణ చైనా, అస్సాం ఈ రెండు ప్రాంతాలు మాత్రమే స్థానిక టీ మొక్కల కు ప్రసిద్ధి. 19వ శతాబ్దంలో చాయ్‌ తాగే అలవాట్లలో అస్సాం టీ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. వేరువేరు మొక్కల ద్వారా
రకరకాలైన రుచులు గల టీ పొడి ఉత్పత్తి అవడమే ఇందుకు కారణం.

  • తేయాకును కొండచరియల్లోనే ఎందుకు పండిస్తారు?
-చాలామంది రోజూ తాగే పానీయం టీ. ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాల్లో తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు ఆకులను కోసి, వీపు మీద ఉన్న బుట్టల్లో వేసు కోవడం సినిమాల్లో చూసే ఉంటారు. టీ తోటలను కొండ ల్లో పెంచుతారని గ్రహించే ఉంటారు. కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పెంచుతారో చూద్దాం. తేయాకు పంటకు తగు మాత్రం వర్షపాతం అవసరం. కానీ నీరు నిల్వ ఉండకూడదు. అందుకే ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాలలో తేయాకును పండిస్తుంటారు. మన దేశంలో అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా తేయాకుని పండిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, నీలగిరి కొండల్లో కూడా తేయాకు తోటలు ఉన్నాయి. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో, ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.
  • ఎన్నెన్నో వెరైటీలు...
మసాలా టీ : లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, శొం ఠి కొద్ది కొద్దిగా తీసుకుని పొడి చేసి డబ్బాలోవేసి పెట్టుకోం డి. టీ చేసేటప్పుడు టీపొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తరవాత పాలు, చక్కెర కలపా లి. ఇది మంచి, ఘాటైన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్ని వేసి డికాక్షన్‌ బాగా మరిగించినందున ఆ దిసుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి. దాల్చిన చెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియ మెరుగవుతుంది. అంటు వ్యాధులనుండి కాపాడుతుంది.

గులాబీ టీ : టీ కోసం నీరు మరిగించేటప్పుడు తాజా గులాబీ రేకులు వేసి మూతపెట్టి మరిగించండి. కొద్దిసేపు తరువాత టీపొడి, పాలు, చక్కెర వేసి మరిగించండి. మంచి సువా సనతో కూడిన టీ రెడీ.

పుదీనా టీ : ముందుగా కడిగి, సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసి నీరు మరిగించండి. పిమ్మట టీపొడి, పాలు, చక్కెర వేసి మరిగించండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

కోకో టీ: టీ తాగే అలవాటున్నవారికి చాక్లెట్‌ రుచి కావాలంటే  టీ మరిగేటప్పుడు మీకు కావలసిన కోకోపౌడర్‌ కలపండి. ప్రత్యేకమైన రుచిగల టీ తయారు.

లెమన్‌ టీ : టీపొడి వేసి నీళ్లు మరిగించండి. దింపి మూత పెట్టండి. చల్లారి, చిక్కటి డికాక్షన్‌ తయారయ్యాక వడగట్టండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం చేర్చండి. తరవాత తగినంత చక్కెర వేసి బాగా కలపండి. ఐసు ముక్కలు వేసి చల్లగా సర్వ్‌ చేయండి. ఇందులోపాలు కలపాల్సిన పనిలే దు. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు ఈ లెమన్‌ టీ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

అల్లం టీ : అల్లం కడిగి, పొట్టు తీసి చిన్న ముక్కను దంచి టీ మరుగుతున్నపుడు వేయాలి. ఈ టీ తాగితే జీర్ణ క్రియ మెరుగవుతుంది. కీళ్ళనొప్పుల ఉపశమనానికి కూడా మంచిది. తల తిరుగుడు ఊపిరితిత్తుల్లో కఫం వంటి ఇబ్బందుల నుండి కూడా బయట పడేస్తుంది ఈ అల్లం టీ.

ఇలాచీ టీ : యాలకులు తొక్కతో కలిపి పొడి చేసి టీపొడితో పాటు మరిగించాలి. ఉత్త తొక్కలు కూడా వేయొచ్చు. మంచి సువాసనగల ఈ టీ రుచి అమోఘం. అప్పుడప్పుడు అల్లం, యాలకులు కలిపి కూడా టీ చేసుకోవచ్చు.

బ్లాక్‌ టీ : పాలు లేకుండా చేసేది బ్లాక్‌ టీ. ఇది రక్తం గడ్దకట్ట నీయదు. తద్వారా గుండెపోటును నివారిస్తుంది. ఉదర, పేగు, రొమ్ము క్యాన్సర్లు రావడం తగ్గుతుందని పరిశోధకుల భావన. ఇది వాపులను తెచ్చే జన్యుప్రభావాన్ని అడ్దుకుంటుంది. సూక్ష్మజీవులను సంహరించగల శక్తి కలది. ము ఖ్యంగా చర్మ వ్యాధులు, విరేచనాలు, న్యుమోనియా కారక సూక్ష్మజీవులను సమర్ధతతో నిరోధిస్తుంది.

గ్రీన్‌ టీ : గ్రీన్‌ టీని పానీయంగా కాక ఔషధంగా భావిస్తారు, దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. గ్రీన్‌ టీ అధికంగా తీసుకు నేవారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. దీనిలో పాలిఫినాల్స్‌ యాంటి యాక్సిడెంట్స్‌ గా పనిచేస్తాయి. ముఖ్యంగా మెదడు భాగంలో బాగా పనిచేస్తాయి. ఎల్‌.డి.ఎల్‌, కొలెస్ట రాల్‌, సీరం ట్రైగ్లిసరైడ్స్‌ స్తాయిని తగ్గిస్తుంది. రక్తంలోని ప్లేట్లెట్లను ఒక చోటకి చేర్చి అతుక్కుపోకుండా చేస్తుంది గ్రీన్‌ టీ. అధిక రక్తపోటుకు కారణాలలో ఒకటి మూత్రపిండాల నుండి విడుదలయ్యే ఏంజియోటెన్షన్‌, కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ ప్రభావాన్ని గ్రీన్‌ టీలోని రసాయనాలు అడ్డు కోవడం వల్ల రక్తపోటు వీలైనంత తగ్గుతుంది. గ్రీన్‌ టీ దంతక్షయాన్ని ఆపగల శక్తి కలిగి ఉంది, రక్తంలో చక్కెర స్థాయి  తగ్గుతుంది, పలు వైరస్‌ల పాలిట మృత్యు వు, కొన్ని మేలు చేసే బాక్టీరియాలను పెంచు తుంది.

తులసి టీ : తులసి ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా అకుపచ్చ రంగులో ఉండేది లక్ష్మి తులసి. కృష్ణ తులసి ఆకులు, కొమ్మలు కాస్త నలుపు కలిసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ఆకు ఘాటుగా ఉంటుంది. ఔషద విలువలు రెండింటిలోనూ ఒకే రకంగా  ఉంటాయి. ఇది వర్షాకాలం దగ్గు, జలుబు, జ్వరం కలిసికట్టుగా దాడిచేస్తాయి. తులసితో వాటన్నింటినీ ఎదుర్కొనవచ్చు. తులసి 'టీ' చేయడం చాలా సులభం... టీ చేసేటప్పుడు దానిలో తులసి ఆకులను మరిగిస్తే సరి.

  • ఒక కప్పు టీ తాగండి.. బరువును తగ్గించుకోండి..
కొన్ని యూనివర్సిటీల పరిశోధనల ప్రకారం టీ తాగడం వల్ల శరీరానికి మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని తేల్చారు. టీ తాగడం వల్ల బరువు తగ్గించడంలో బాగా సహాయపడు తుందని తేల్చారు. అవును... ఇది అక్షరాలా నిజం..! ప్రతి రోజూ మీరు తీసుకొనే డైట్‌ తో పాటు ఒక కప్పు టీ తీసుకోవడం వల్ల బరువు
తగ్గుతారు. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందుకు గ్రీన్‌ టీ బాగా పనిచేస్తుంది.

 

Courtesy with Surya Telugu Daily

  •  =========================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .