Thursday, May 3, 2012

తెలుగు సినిమా జన్మదినం ,Telugu Cinema Day Celebration,Telugu Cinema Birthday



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) - తెలుగు సినిమా జన్మదినం - Telugu Cinema Birthday- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఉల్లాసపరిచేవి సినిమాలు. నేడు సినిమాలు చూడనివారు ఉండరంటే అతి శయోక్తి కాదు. ఒకొ్కక్కరికీ ఒక రకమైన చిత్రాలంటే ఇష్టం. కుటుంబ కథా చిత్రాలు, హారర్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాలు, లవ్‌, రొమాన్స్‌ చిత్రాలు...వంటివి ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నారుు. ఈ నేపథ్యంలో అసలు తెలుగులో తొలి టాకీ చిత్రం ఏదన్న విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. మూకీ చిత్రాల కాలం పోరు తెలుగులో వచ్చిన తొలి టాకీ చిత్రం ''భక్త ప్రహ్లాద''. ఈ సినిమా 1931 సంవత్సరం సెప్టెంబర్‌ 15న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్‌ 15నాడు ‘తెలుగు సినిమా జన్మదినం’ను జరుపుకుంటున్నారు. 80వ తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకున్నారు .


భారతీయ చలనచిత్ర పరిశ్రమను తీసుకుం టే మూకీల కాలం పోయి టాకీ సినిమాలు వచ్చినవి 1931లో. 1931 మార్చి 14న ముంబయిలోని మెజిస్టిక్‌ థియేటర్‌లో విడులైన ''ఆలమ్‌ ఆరా'' సినిమాయే తొలి భారతీయ టాకీ చిత్రం. ముంబయిలోని ఇంటీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ అధినేత అర్దేషిర్‌ ఎం.ఇరానీ ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఇక ఈ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత దక్షిణాదిన టాకీ సినిమా విడుదలైంది

  • తొలి టాకీ సినిమా...
తెలుగులో వచ్చిన తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1931 సెప్టెంబర్‌ 15న విడుదలైంది. అప్పటి నుంచి టాలీవుడ్‌లో సెప్టెంబర్‌ 15న ప్రతి ఏటా తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి 80 సంవత్సరాల తెలుగు సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇకపై ప్రతి సంవత్సరం సినిమా కార్మికులకు ఈరోజున సెలవు దినంగా ప్రకటించారు. భక్త ప్రహ్లాదసినిమాలో ప్రహ్లాదగా మాస్టర్‌ కృష్ణారావు, లీలావతిగా సురభి కమలాబాయి, హిరణ్యకశిపుడుగా వి.వి.సుబ్బారావు నటించారు. ఇక తొలి తెలుగు, తమిళ టాకీల సినిమాలకు దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి. తమిళ టాకీ సినిమా కాళీదాస్‌ 1931 అక్టోబర్‌ 31న విడుదలైంది.

ఆ తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి తన మకాంను ముంబయికి మార్చి దర్శక నిర్మాత అర్దేషిర్‌ ఎం.ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన పలు టాకీ చిత్రాలకు హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక మూకీ రోజుల్లో ముంబయిలో ఉన్న నటుడు ఆ తర్వాత దర్శక, నిర్మాతగా మారిన ఎల్‌.వి.ప్రసాద్‌ ఆలమ్‌ ఆరా సినిమాలో నటించడం విశేషం. ఆయన హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్కున్న తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో సైతం నటించారు.

  • తొలి డిటెక్టివ్‌ చిత్రం...
తెలుగులో తొలి డిటెక్టివ్‌ చిత్రం ''గూడాచారి 116''. 1967లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణగా హీరోగా చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌గా హీరో కృష్ణతో పలు చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఆ కాలంలో ప్రేక్షకులను మైమరపించింది. ఈ సినిమాకు దర్శకుడు ఎం.మల్లిఖార్జునరావు, నిర్మాత డూండి. కృష్ణతో జంటగా జయలలిత హీరోయిన్‌గా చేయగా రాజనాల, ముక్కామల తదితరులు నటించారు.

  • తొలి కలర్‌ సినిమా...
తెలుగులో వచ్చిన తొలి కలర్‌ సినిమా ''లవకుశ''. సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సముద్రాల రాఘవాచార్యులు సినిమాకు కథ రాశారు. 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తమిళం, కన్నడంలోకి సైతం డబ్‌ చేశారు. సినిమాలో ఎన్టీరామారావు, అంజలి దేవి, టి.ఎల్‌.కాంతారావు నటించారు. సంగీతాన్ని ఘంటసాల సమకూర్చారు.

  • తొలి స్కోప్‌ సినిమా...
తెలుగులో తొలి సినిమా స్కోప్‌ చిత్రం ''అల్లూరి సీతారామరాజు''. ఈ చిత్రం 1974 మే 1న విడుదలైంది. సూపర్‌స్టార్‌ కృష్ణ తన సొంత బ్యానర్‌ పద్మాలయపై దీన్ని రూపొందించారు. అల్లూరి సీతారామరాజు గా కృష్ణ అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించగా మహారథి త్రిపురనేని కథను సమకూర్చారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

  • దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు-
తొలి సినిమా రాజా హరిచంద్ర నిర్మించిన సాహసి దాదా సాహెబ్‌ ఫాల్కే- 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు ఎందరో ఉన్నారు. సినీ నటుడు, దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌, నిర్మాత బి.నాగిరెడ్డి, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సినీ నిర్మాత డి.రామానాయుడులు ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు.

బి.నాగి రెడ్డి చెన్నైలో విజయ వాహిని స్టూడియోను నిర్మిం చారు. ఆ కాలంలో ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా ఇది పేరుగాంచింది. నాగిరెడ్డి పలు సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు.



సినీ నటుడు, దర్శక నిర్మాత అయిన ఎల్‌.వి.ప్రసాద్‌ అసలు పేరు అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1982లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందజేసింది. ప్రసాద్‌ ప్రొడక్షన్‌ను నెలకొల్పిన ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో మిలన్‌, ఖిలోనా, ససురాల్‌, ఏక్‌ దూజే కె లియే వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు.

టాలీవుడ్గలో 69 సంవత్సరాల సినీ ెకరీర్‌లో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. 1941 నుంచి ఆయన సినిమాల్లో నటిస్తుండడం విశేషం. తెలుగు సినిమా జన్మించిన 10 సంవత్సరాల కాలం నుంచి ఆయన టాలీవుడ్గలో కొనసాగుతున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రేమాభిషేకం సినిమా హైదరాబాద్‌లో 533 రోజులు ఆడడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావుకు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు(1990), పద్మశ్రీ (1968), పద్మభూషణ్‌(1988), పద్మ విభూషణ్‌ (2011) తదితర అవార్డులు దక్కాయి.

భారతదేశ సినీ రంగంలో డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు సినీ నిర్మాతగా ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆయన ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ అవార్డును 2009లో దక్కించుకున్నారు. ఇక అత్యధికంగా సినిమాలను నిర్మించిన సినీ నిర్మాతగా ఏకంగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు సినిమాలేగాకుండా హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సినిమాలను సైతం నిర్మించి పేరుతెచ్చుకున్నారు.

  • గిన్నిస్‌ బుక్‌లో...
గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన సినీ ప్రముఖులు టాలీవుడ్‌లో కొందరున్నారు. వీరిలో దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల, బ్రహ్మానందంలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటుదక్కింది.

హాస్యనటుడు బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నటించే బ్రహ్మానందం తెలుగు చిత్రాల్లో 850 చిత్రాల కు పైగా చేసి ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు సంపా దించారు. ఒకే భాషలో ఇన్ని చిత్రాలు ఏ నటుడు చేయక పోవడం విశేషం. కేంద్ర ప్రభు త్వం ఆయనకు పద్మ శ్రీ అవా ర్డును, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను ప్రదానం చేసింది.

అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఆమె 47 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరో కృష్ణ సతీమణి అయిన విజయనిర్మల భర్త ప్రోత్సాహంతో మహిళా దర్శకురాలిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఇక సినీ హీరోయిన్‌గా ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించారు. తెలుగు సినీ రంగంలో చేసిన కృషికి గాను ఆమె 2008లో రఘుపతి వెంకయ్య అవార్డును దక్కించు కున్నారు.

సినీ దర్శకుడిగా,నిర్మాతగా, రాజకీయనాయకుడిగా పేరుతెచ్చుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 53 సినిమాలను నిర్మించారు. ఇక 250 సినిమాలకు మాటలు రాయడమే కాకుండా పాటలు కూడా రాశారు. తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టాయి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా దాసరి నారాయణరావు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదిం చారు.


-ఎస్‌.అనిల్‌కుమార్‌ (Courtesy with Surya Daily news paper)
  • =================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .