Thursday, September 15, 2011

ఇంజనీర్స్ దినోత్సవం , Engineers Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Sept 15) -ఇంజనీర్స్ దినోత్సవం , Engineers Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


సృజనాత్మకమైన వృత్తి నైపుణ్యాలతో పరిమితమైన వనరులతోనే నాణ్యమైన పనులు నిర్వహించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ల వలే ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోయేందుకు ప్రతీ ఇంజనీర్‌ కృషి చేయాలని .తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి జాతి గర్వించే ఎన్నో సాంకేతిక కట్టడాలు అందించిన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రతి ఇంజనీర్‌కు స్పూర్తిదాత అన్నారు. ప్రతి ఇంజనీర్‌ శరవేగంతో విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుని మేలైన కొత్త పద్దతులను తాము చేపట్టే పనుల్లో అన్వయించాలని

మన భారతదేశంలో సెప్టెంబర్ 15కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఈ రోజును మనం "ఇంజనీర్స్ డే" (ఇంజనీర్ల దినోత్సవం)గా జరుపుకుంటాం. శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య భారత ఇంజనీర్‌గా గుర్తింపబడినవారు. ఈయనను 1955లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే "భారత రత్న" బిరుదుతో సత్కరించింది.

దేశవ్యాప్తంగా ఈ రోజు ఇంజనీర్ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ రోజను పురస్కరించుకొని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు జరుపుకునే ఇంజనీరింగ్ దినోత్సవం 150వది. ఈయన హైదరాబాదు నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు ఓ వ్యవస్థను రూపొందించారు.

శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య పూర్తి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన భారతదేశపు ప్రముఖ ఇంజనీరు. బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు 1861 సెప్టెంబర్ 15న ఆయన జన్మించారు. ఈయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు.

భారత రత్న విశ్వేశ్వరయ్య పూనేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఈయన కృష్ణా నదిపై నిర్మించిన "కృష్ణరాజ సాగర్" నిర్మాణ సమయంలో ఛీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట భారతదేశంలోనే అతిపెద్దది. ఈయన ఆధ్వర్యంలో భారతదేశంలో చాలా డ్యామ్‌లు నిర్మించారు. ఈయన పేరుతో పలు కళాశాలు అవార్డులు కూడా వెలిశాయి. శ్రీ విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 12వతేదీన కాలం చేశారు.

మానవాళికి వరం.. ఇంజనీరింగ్‌ పరిజ్ఞానం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం పురోభివృద్ధి సాధిస్తోంది. ఈకోవలోనే ఇంజనీరింగ్‌ పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంజనీర్లప్రతిభా పాటవాలతో నిర్మాణ, రవాణా రంగాలు నూతన పంథాతో పయనిస్తున్నాయి. భూమిపైనే కాకుండా ఓవర్‌ బ్రిడ్జీలు, ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. మరో అడుగు ముందుకు వేసిన ఇంజనీరింగ్‌ విజ్ఞానం ఆకాశ మార్గాన పయనించడానికి విమానయానం సృష్టించారు. మానవాళి మనుగడకు అడుగడుగునా ఇంజనీర్ల ప్రతిభ దోహదపడుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. విద్యార్థి తొలి అక్షరానికి ఆది గురువుగా ఉపాధ్యాయుడైన సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటాం. ఇదే రీతిని ప్రపంచ ఖ్యాతి పొందిన ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు సెప్టెంబర్‌ 15న ఇంజనీర్స్‌డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మనకు ఇంజనీర్‌ అంటే రోడ్లు, భవనాలు పంచాయతీ రాజ్‌, ప్రాజెక్టుల్లోపని చేసే వారే గుర్తుకువస్తారు. కానీ ఇంకా అనేక విభాగాల్లో సింగరేణి, ఎన్‌టిపిసి విభాగాల్లో పని చేసే ఇంజనీర్లూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఏడాదికి 1.70 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రా, వెంకటేశ్వర, ఉస్మానియా, కాకతీయ, జెఎన్‌టియూ యూనివర్సిటీలు సేవలు అందిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వైద్యుడు, ఇంజనీరు కావాలని అనుకుంటున్నారు. ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఈ విద్య కోసం పోటీ పడి చదువుతున్నారు. ఎంసెట్‌ ఏఐఈఈఈ సీట్ల కోసం విద్యార్థులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. ఇంజనీరింగ్‌ విద్య పూర్తికాక ముందే నేడు విదేశీ కంపెనీల క్యాంపస్‌ ఎంపికల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. రూ.20 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు.

ఇంజనీరింగ్‌లో వివిధ విభాగాలు

నేడు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు సంవత్సరానికి వివిధ విభాగాల్లో లక్షల మందిని ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌ ఒక్కటే మనకు తెలుసు కానీ 12 రకాల విభాగాలు ఉన్నాయి. ఏఎన్‌ఈ(ఏరోనాటికల్‌), బీఐఓ( టయోటెక్నాలజీ), సీఎంఆర్‌(కెమికల్‌ టెక్నాలజీ), సీఈఈ(కెమికల్‌), సీఈఈ(సివిల్‌), సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌), ఈసీఈ(ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌), ఈఈఈ(ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్‌), ఐఎస్‌ఎఫ్‌(ఇన్‌ఫర్మేషన్‌ కంట్రోల్‌) ఇంజనీరింగ్‌లలో వీటితో పాటు మరో ఐదు విభాగాలు ఉన్నాయి.

అభివృద్ధికి నాంది ఇంజనీరింగ్‌

గతంలో ఎంతోఆదరణ చూరగొన్న సివిల్‌ఇంజనీరింగ్‌ ప్రభుత్వ రంగంలో అవినీతిలో కూరుకుపోయిందనే ఆరోపణలున్నాయి. ఇదే ప్రయివేటు సెక్టార్‌లో ప్రతిభలో కూడిన కాసుల గల గలల కొలమానంగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో అభివృద్ధిలో భాగంగా వేసిన రోడ్లు, కట్టిన భవనాలు, నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులు, వేసిన పైపులైన్లు కూలిపోవడం, తెగిపోవడం, పగిలిపోవడం గమనిస్తూనే ఉన్నాం. కారణాలు ఏమైనప్పటికీ నాణ్యతకు ప్రతిభ తోడుకాకపోవడమే అని నిపుణులు అంటున్నారు. నాణ్యతకు రాజకీయం, అవినీతి అడ్డుగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పది మందికి ఉపయోగపడే పనులు చేసే టప్పుడు సొంత లాభం కన్నా ప్రజా శ్రేయస్సే ప్రధానం కావాలని భావిస్తున్నా స్థానిక పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ఆశించిన నాణ్యతను వినియోగదారునికి అందకుండా పోతుందని కొంత మంది ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్‌ రంగ పితామహాలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజున జరుపుకునే ఇంజనీర్స్‌ డే సందర్భంగా ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశిద్దాం.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .