Friday, March 4, 2011

రక్తపోటు నియంత్రణ దినోత్సవం,Blood pressure prevention day(Hypertension Day)


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ప్రతి మే నెల 17న)- రక్తపోటు నియంత్రణ దినోత్సవం,Blood pressure prevention day(Hypertension Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, శారీరకపరమైన ఒత్తిడికి గురవ్వడంతో శరీర బరువు పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో సతమతమౌతున్నారు. రానున్న రోజుల్లో వీరు హైపర్‌టెన్షన్, అధిక రక్తపోటుతో బాధపడే సూచలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వైద్య నిపుణులు ప్రతి మే నెల 17న హైపర్‌టెన్షన్ డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ హైపర్‌టెన్షన్ డేను తొలుత ప్రపంచ హైపర్‌టెన్షన్ లీగ్ ద్వారా నిర్వహించడం జరిగింది. వివిధ ఫెడరేషన్‌లు, సొసైటీలు, జాతీయ సంస్థల సమాహారమే ప్రపంచ హైపర్‌టెన్షన్ లీగ్. ఈ సంస్థ ప్రపంచ ప్రజల్లో హైపర్‌టెన్షన్‌ను గుర్తించి, దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తుంటుంది.

నియమానుసారం వ్యాయామం, పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. దీంతో అధిక బరువు, ఇతర జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. ఊబకాయం కారణంగా అధిక రక్తపోటు బారిన పడటమే కాకుండా పక్షవాతం, గుండెపోటులాంటి సమస్యలుత్పన్నమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.



పెరుగుతున్న నగర వాతావరణం, దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు, ఆహార నియమాల్లోను మార్పులు, జంక్‌ఫుడ్ అత్యధికంగా తీసుకోవడంతో భారతదేశంలోను హైపర్‌టెన్షన్ వ్యాధిబారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు ప్రతి ఒక్కరు తగు చర్యలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.

క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి. మద్యపానం అలవాటున్నవారు ఆ అలవాటును మానుకునేందుకు ప్రయత్నించాలి. పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో భాగంగా చూసుకోవాలి. మసాలాతో కూడుకున్న ఆహారాన్ని పూర్తిగా త్యజించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెడీమేడ్ ఆహార పదార్థాలను తీసుకోవడం మానేస్తే హైపర్‌టెన్షన్‌నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఒత్తిడి అధికమై హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రస్తుతం ప్రతి పని కంప్యూటర్‌ ముందు కూర్చుని చేయాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి పిల్లలోను ఉంది. తరచూ కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకుంటుండటంతో శరీరానికి కావలసిన వ్యాయామం అందడం లేదు. అలాగే ఆడుతూ పాడుతూ కనిపించే పిల్లలు నేడు కరువయ్యారనడంలో సందేహం లేదు.

ఎప్పుడు చూసినా పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చుని అందులోనున్న ఆటలను ఆడటం చూస్తుంటాం. ఈ ఆటల్లో మానసికపరమైన ఒత్తిడి నెలకొంటోంది. దీంతో వారు చిన్న వయసులోనే హైపర్‌టెన్షన్ బారినపడే అవకాశాలున్నాయి. పైగా వారు తీసుకునే ఆహారం జంక్‌ఫుడ్‌తో కూడుకున్నదై ఉంటోంది. దీంతో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం కారణంతోనే అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారం పుష్టికరమైనదిగా ఉండేలా చూసుకోండి.


హైపర్ టెన్షన్ వ్యాధి లక్షణాలు ఎట్టిపరిస్థితుల్లోను బయటపడదు. కాబట్టి దీనిని వైద్యపరిభాషలో సైలెంట్ కిల్లర్ అంటుంటారు. అయినప్పటికీ తలనొప్పి, కళ్ళు తిరగడం, తల భారంగా తయారవ్వడంలాంటి సమస్యలుత్పన్నమౌతాయంటున్నారు వైద్యులు. ఇలాంటి సమస్యలున్నట్లు తెలిస్తే వెంటనే వైద్యుని సలహాలు పొంది తగు చికిత్స చేయించుకోవాలి. హైపర్‌టెన్షన్ బారిన పడిన వారి సంఖ్య 1960లో నాలుగు శాతంగా ఉండింది. అదే ప్రస్తుతం ఇరవై నాలుగు శాతానికి చేరుకుందని వైద్య పరిశోధకులు తెలిపారు.

హైపర్‌టెన్షన్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి మనిషి స్వతహాగా తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే... జంక్‌ఫుడ్ తీసుకోకుండా ఉండటం. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకుంటుండటం. మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

For some more details of Hypertension->రక్తపోటు అవగాహణ మరియు నివారణ
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .