Saturday, May 8, 2010

ఓజోన్ పరిరక్షణ దినం , Ozone protection Day




అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం ప్రతి ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచం వ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. భూమ్మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు.

తర్వాత 1995 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నారు. ఓజోన్ పొర రక్షణ కోసం రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఈ తేదీని ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు.
ఓజోన్ పొరను కాపాడుకుందాం..

వివిధ కాలుష్యాల బారిన పడి ధరణీ మాత విలపిస్తోంది. ఓజోన్ పొరకు పడ్డ చిల్లును పూడ్చడం ద్వారా ప్రతిదేశం ఓజోన్ పరిరక్షణకు, భూమాత పరిరక్షణకు తన వంతు ప్రయత్నాలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలి. ఇదే అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం మానవాళికి ఇస్తున్న సందేశం.


ప్రపంచాన్ని ఆవరించిన పలు పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి కలిసికట్టుగా పనిచేయాలనే ఆశాభావాన్ని ఈ ఓజోన్ పరిరక్షణ దినం అందిస్తోంది. దశాభ్దాలుగా మానవులు జరిపిన పరిశోధనల పలితమే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్. ఓజోన్ ‌పొరను దెబ్బతీసేలా వాతావరణంలో విడుదల అవుతున్న రసాయనాలను ఇది నిర్ధారించింది.

భూమి పైభాగంలో స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఉన్న ఓజోన్‌ పొర భూమ్మీదికి వచ్చే అన్ని విశ్వ కిరణాలను అడ్డుకుని భూమిని పరిరక్షిస్తోంది. రసాయన కాలుష్యాల ప్రభావ ఫలితంగా ఓజోన్ పొరకు చిల్లు పడినట్లయితే సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు ప్రసరించి మానవజాతికి, సమస్త జీవజాతులకు ప్రమాదకారిగా మారతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 20 నుంచి 30 లక్షల మంది చర్మ కేన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో 20 శాతం పైగా రోగులు సూర్యకాంతి నేరుగా సోకిన ఫలితంగా కేన్సర్ బారిన పడుతున్నారని ఒక అంచనా.

వియన్నా కన్వెన్షన్ మరియు మాంట్రియల్ ప్రోటోకాల్‌లో భాగమైన భారత్, ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించి ప్రపంచ ఆందోళనలో పాలు పంచుకుటోంది. ఎఫ్‌సి, హాలోన్స్, సిటిసి మిధేల్ క్లోరోఫారం, మిథేల్ బ్రొమైడ్ మరియు హెచ్‌‌సిఎఫ్‌సి వంటి ఓజోన్‌ను బలహీనపర్చే పదార్ధాల తయారీని నియంత్రించేందుకు భారత్ నడుం కట్టింది.

ఏరోసోల్ ఉత్పత్తులు, రిఫ్రెజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులు, ఫోమ్ బ్లోయింగ్ అప్లికేషన్లు, అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే సామగ్రి, లోహ శుద్ధీకరణ అప్లికేషన్లు వంటి ఉత్పత్తులలో ఈ పదార్ధాలను ఉపయోగిస్తున్నారు.

మాంట్రియల్ ప్రోటోకాల్‌ సంబంధింత చర్యల అమలుకు గాను 1993 నుంచి పలు కార్యాచరణలను భారత్ చేపట్టింది. సిఎఫ్‌సి, హలోన్, సిటిసి వంటి పదార్ధాల ఉత్పత్తి వినియోగాన్ని నిలిపివేసేందుకు గాను 296 కన్వర్షన్ ప్రాజెక్టులను భారత్ ఆమోదించింది. ఈక్రమంలో 2008 ఆగస్ట్ నాటికి క్లోరోఫ్లోరో కార్బన్‌ల వినియోగాన్ని భారత్ పూర్తిగా నిలిపివేసింది. దీంతో షెడ్యూల్ కంటే ముందే ఈ పథకాన్ని పూర్తి చేసిన తొలిదేశంగా భారత్ రికార్డు కెక్కింది.

తర్వాత సిటిసి ఉత్పత్తి మరియు వినియోగాన్ని 85 శాతం మేరకు కుదించడానికి సంబంధించిన కీలక లక్ష్యాన్ని భారత్ సాధించింది. హలోన్స్ తయారీ ఉత్పత్తులను కూడా 2003 నుంచి భారత్ పూర్తిగా నిలిపివేసింది. కాగా హెచ్‌సిఎఫ్‌సి ఉత్పత్తులను నిలిపివేసే ప్రక్రియను 2040 నుంచి 2030కి తగ్గిస్తూ మాంట్రియల్ ప్రొటోకాల్ పార్టీల 19వ సమావేశం నిర్ణయం తీసుకుంది.

మాంట్రియల్ ప్రోటోకాల్‌ను అత్యుత్తమంగా అమలుచేసిన దేశాలకు ఇచ్చే అవార్డును భారత్ కైవసం చేసుకుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ 20 వార్షికోత్సవం సందర్భంగా కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 2007 సెప్టెంబర్ 16న భారత్ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకుంది.

వివిధ కాలుష్యాల బారిన పడిన ధరణీ మాత విలపిస్తోంది. ఓజోన్ పొరకు పడిన చిల్లును పూడ్చడం ద్వారా ప్రతిదేశం ఓజోన్ పరిరక్షణకు తద్వారా భూమాత పరిరక్షణకు తన వంతు ప్రయత్నాలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలి. ఇదే అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం మానవాళికి ఇస్తున్న సందేశం.
  • =======================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .