Saturday, April 17, 2010

తెలుగు నాటకరంగ దినోత్సవం , Telugu StageDrama Day



ఏప్రిల్ 16 తేదీని ... కందుకురి వీరేశ లింగం పంతులు గారి పుట్టిన రోజు ను తెలుగు నాటకరంగ దినోత్సవం గా పరిగణించారు .
ప్రపంచ నాటక చరిత్రలో తెలుగు రంగానికి ప్రత్యేకత ఉన్నది . విశ్వ సాహిత్యములొ తెలుగులొనే పద్యప్రక్రియ ఉండటం విశేషము . ఆది నుండి తెలుగులో నాటకరచన , ప్రదర్శనలకు తెరతీసినవారంతా పాటశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులే . అలనాటి మంజరీమధుకరీయం ... తొలినాటక కర్త నుంచి కొక్కొండ వెంకటరత్నం పంతులు , పరవస్తు వెంకటరంగాచార్యులు , వావిలాల వాసుదేవశాస్త్రి , నాదెళ్ళ పురుషోతమకవి , వడ్డాది సుబ్బరాయకవి .. వరకు తెలుగు పండితులే . ఆధునిక తెలుగు నాటకరచన , ప్రదర్శనలకు వీరంతా ఆద్యులుగా నిలిచారు . సుర్భి క్ళాసంస్థ లాంటి నాటక సమాజాలు ఇప్పటికీ ఉత్తమ రంగాలంకరణ ప్రదర్శనలతో ప్రేక్షకుల మెప్పుపొందుతూ నాటకం నిత్య నూతనమని చాటిచెబుతున్నాయి . అందుకే ఆంధ్ర , తెలుగు విశ్వవిద్యాలయాలు , దైదరాబాద్ సెంట్రల్ యూనివర్సెటీల్లో రంగస్ఠల కళల శాఖలు ప్రత్యేకం గా ఏర్పాటుచేశారు .

తెలుగు నాటక రంగం చరిత్ర


"కావ్యాంత నాటకం" అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని కావ్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ప్రపంచ సాహిత్యంలో "మేఘ సందేశం", "అభిజ్ఞాన శాకుంతలం" వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమని ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నాటకానికి అంత శక్తి వుంది. "కాబట్టే నాటకం రసాత్మకం కావ్యం" అన్నాడు.

తెలుగు నాటక రచన ఆవిర్భావానికి దేశంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. 1857లో ముంబై, చెన్నై మహానగరాలలో భారత దేశంలోని మూడు ప్రధాన విశ్వ విద్యాలయాల అంకురార్పణ జరగడంతో ఆంగ్ల విద్యావ్యాప్తి శీఘ్రగతిని పురోగమించింది. ఇది దేశ భాషలలో పండితులపై ప్రభావాన్ని చూపింది. వీరు తమ భాషలో లేని సాహిత్య ప్రక్రియలను క్రొత్తగా అవతరింపజేయడానికి పూనుకున్నారు. ఈవిధంగా తెలుగుదేశంలో ఆధునిక నాటక రచన-ప్రదర్శనలకు దారితీసినవారు పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానంగా పండితులు. అటువంటివారిలో కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకటరంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి గార్లు ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రధములు. కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మన్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రధములు.

ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభం కాగా నాటక ప్రదర్శనం మాత్రం 1880లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "మంజరీ మధుకరీయము". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించారు. ముద్రణ మాత్రం 1908లో జరిగింది. సంస్కృతంలోనుంచి నాటక లక్షణానలు అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. అదేవిధంగా 'ఆంధ్రా జాన్సన్‌గా సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1871 ప్రారంభంలో ఆంధ్రుడైన వారణాశి ధర్మసూరి సంస్కృతంలో రచించిన "నరకాసుర విజయము" అనే వ్యాయోగమును ఆంధ్రీకరించారు. ఇది 1872లో ప్రకటితమయింది. అదేవిధంగా రిఫార్మర్ పండిట్ అని ప్రసిద్ధికెక్కిన పరవస్తు వెంకట రంగాచార్యులు 1872 ప్రాంతాల్లో కాళిదాసు రచించిన "అభిజ్ఞాన శాకుంతలము"ను ఆంధ్రీకరించడం జరిగింది. ఇదిలావుంటే వావిలాల వాసుదేవశాస్త్రి గారు ఆంగ్ల నాటక ఆంధ్రీకరణకు మార్గం వేశారు. జూలియస్ సీజర్ నాటకాన్ని "సీజరు చరిత్రము" అను పేరుతో 1874లో ఆసాంతం తేటగీతిలో ఆంధ్రీకరించారు. ఇది 1876లో ప్రకటితమయింది. తెలుగులో పద్య నాటకాన్ని, విషాదాంత నాటకాన్ని రచించినవారిలో వాసుదేవశాస్త్రి గారు ప్రధములు.

ఆధునిక నాటక రచనకు ఆద్యులు వారైతే ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమకవి, వడ్డాది సుబ్బారాయుడు గార్లు రూపకర్తలు. వీరేశలింగం గారు సంభాషణా రూపాన "బ్రాహ్మ వివాహము" అను ప్రకటనమును తన "హాస్య సంజీవని" అను పత్రికలో రచించారు. అనంతరం "వ్యవహార ధర్మబోధిని" అనే నాటకాన్ని ప్రకటించారు. ఇది వ్యావహారిక భాషలో రచించబడింది. వ్యావహారిక భాషలో ఆసాంతం రచన సాగించడం ఆనాడు ఒక సాహసం. పైగా ప్రదర్శనా భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకమిది. 1880లో వీరేశలింగం గారు నాటక సమాజాన్ని స్థాపించి "రత్నావళి", "చమత్కార రత్నావళి" అను రెండు నాటకాలను ప్రదర్శించారు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగం గారిదే. వీరి స్వతంత్ర రచన అయిన "వ్యవహార ధర్మబోధిని", సంస్కృత నాటక అనువాదమైన "రత్నావళి", ఆంగ్ల నాటక అనుసరణ అయిన "చమత్కార రత్నావళి" ప్రదర్శనా భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880లో జరిగింది. అందుచేత 1980వ సంవత్సరం తెలుగు నాటకరంగ శత జయంతి సంవత్సరం అయింది.

తెలుగు నాటకాలలో పద్య పఠనమును (ఈనాడువలె గానం కాదు) ప్రవేశపెట్టినవారు వ.సు.కవిగా పేరొందిన వడ్డాది సుబ్బారాయుడు. వీరి నాటకాలలో ప్రసిద్ధమైనది "వేణీ సంహారము". ఇది 1883లో ప్రకటితమైంది. ఇది సంస్కృతంలో భట్టనారాయణుడు రచించిన "వేణీ సంహర" నాటకానికి ఆంధ్రీకరణ. మూలం వలనే తెలుగు కూడా గద్య పద్యాత్మకమే. ఈ పద్యాలని రంగస్థలం మీద పఠించేవారు. 1884-86 మధ్య నాదెళ్ళ పురుషోత్తమ కవి 32 హిందూస్తానీ నాటకాలు రచించారు. వీటిని 15 ఏళ్ళపాటు అనేక పట్టణాలలో విజయవంతంగా ప్రదర్శించారు. పాత్రోచిత భాష, అనుప్రాసయుక్తము ప్రాబంధికము అయిన శైలి వీరు పాటించిన అంశాలు. పాటలు (టపాలు) పాడుట వీరు ప్రవేశపెట్టిన క్రొత్త అంశము. ఈ మూడు అంశాలు కాలక్రమంలో తెలుగు నాటక రంగం మీద ప్రాధాన్యం వహించాయి. 1886 వరకు తెలుగు నాటక రంగం సర్కారు జిల్లాలకు, అందునా కృష్ణ, గోదావరి మండలాలకు ప్రధానంగా పరిమితమై ఉంది. 1887 నుండి బళ్ళారి సీమ వెలుగులోకి వచ్చింది. ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు తన తొలి తెలుగు నాటకమైన "చిత్రనళినీయం"‌ను బళ్ళారిలో 1887 జనవరి 29న విజయవంతంగా ప్రదర్శించారు. నాటక భాషగా తెలుగు పనికిరాదన్న భావం ఆనాడు బళ్ళారి సీమలో ప్రబలివుంది. కాని "చిత్రనళినీయం" విజయవంతం కావడంతో బళ్ళారి కన్నడ సీమ కాదన్న భావం ప్రబలమైంది. రామకృష్ణమాచార్యులవారు 30 నాటకాలు రచించారు. అన్నీ స్వతంత్ర రచనలే. వీరు తన నాటకాలలో పాటలు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా పద్యాలను రాగయుక్తంగా పాడడం కూడా ప్రవేశపెట్టారు. వీరి "సారంగధర" తెలుగులోని తొలి స్వతంత్ర విషాద రూపకం. వీరికి ముందు తెలుగు నాటక రచనకు సుప్రసిద్ధమైన మార్గం లేదు. ప్రాచ-పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయించడంలో వీరు ప్రధములై విలసిల్లారు. అందుకే వీరిని "ఆంధ్ర నాటక పితామహ" అని బిరుదునిచ్చి సత్కరించారు.

ప్రముఖ హాస్య రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1989లో నాటక రచన ఆరంభం చేశారు.వీరి నాటకాలలో "గయోపాఖ్యానం" సుప్రసిద్ధమైనది. 1891లో "నాగానంద" ఆంధ్రీకరణతో తెలుగు నాటకరంగమందు అడుగుపెట్టిన వేదం వెంకటరాయశాస్త్రి గారు రచించిన "ప్రతాపరుద్రీయం" బహుళ ఖ్యాతినొందింది. కల్పనా శక్తి రచయితకు సాహిత్య రంగంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని అందిస్తుందో ఈ నాటకమే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ నాటకంలో వీరి కల్పిత పాత్రైన యుగంధర మంత్రి చారిత్రక పురుషుడుగా ఆంధ్ర సారస్వతంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అట్లే పేరిగాడు, విద్యానాధుడు, చెకుముకు శాస్త్రి, ఎల్లి మొదలగు పాత్రలు వీరి రచనా చమత్కారం వలన చిరస్మరణీయమైన పాత్రలుగా రూపొందారు.

1887లో ప్రకటితమైన గురజాడ అప్పారావుగారి "కన్యాశుల్కం" వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం. 1892 ఆగస్టులో విజయనగరంలోని జగన్నాధ విలాసినీ నాటక సమాజం వారు దీనిని ప్రధమంగా విజయవంతంగా ప్రదర్శించారు. వ్యావహారిక భాషలో ఓ కొత్త మలుపు తెచ్చిన నాటకమిది. "ప్రతాపరుద్రీయం", "కన్యాశుల్కం" రెండు రాత్రుల రూపకాలు కాగా 1894 ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసినవారు కోలాచలం శ్రీనివాసరావుగారు. వీరు అధికంగా చారిత్రక నాటకాలు రచించడంచేత "చారిత్రక నాటక పితామహుడు"గా పేరొందారు. వీరి నాటకాలలో "కర్ణాటక రాజ్యనాశము" లేదా "రామరాజు చరిత్రము"నకు తెలుగుదేశమంతటా విశేష ప్రాచుర్యం తెచ్చినవారు ఆచార్యులవారి మేనల్లుడైన బళ్ళారి రాఘవ.

అదేవిధంగా పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన తొలి నాటకం "నర్మదాపురుకుత్సీయము" 1900లో ప్రకటితమైంది. 30కి పైగా స్వతంత్ర నాటకాలు రచించిన వీరికి షేక్‌స్పియర్ ఆదర్శం. వీరి వచన రచన వ్యావహారికానికి దగ్గరగా ఉండే సరళ గ్రాంధికం. వెరి రచనలలో లోకోక్తులు, పలుకుబడులు అధికం. వీరి నాటకాలలో "రాధాకృష్ణ", "పాదుకాపట్టాభిషేకం", కంఠాభరణము" ప్రసిద్ధమైనవి. "కంఠాభరణము"తెలుగులో పరిపూర్ణమైన స్వతంత్ర స్వతంత్ర ప్రహసనము. 1900 నాటికి తెలుగు నాటక రచన, ప్రదర్శన వ్యాసంగాలు తెలుగుదేశంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపించాయి. 1906-20 మధ్య ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు అనువదించుట, ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు నాటకాలు రాయడం జరిగింది. ఈవిధంగా ఈ కాలంలో బయల్దేరిన "హరిశ్చంద్ర" నాటకాలు 13. "సారంగధర 8. ఇంకా అనేక ఇతర నాటకాలు. ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి ప్రభావం వల్ల నాటకాలలో పద్యాలకు, పాటలకు విలువ హెచ్చిన కాలమిది. ఈ కాలంలోని ముఖ్య విశేషం తెలుగుదేశంలో వ్యాపార నాటక రంగం విజృంభించడం.

1913 ప్రాంతాల్లో కృష్ణా మండలంలో నాటక పోటీలు ప్రారంభమై దేశమంతటా వ్యాపించాయి. "గయోపాఖ్యానం", "ఉద్యోగ విజయాలు", "బొబ్బిలి యుద్ధం", "రంగూన్ రౌడి" మొదలగు నాటకాలకు విడివిడిగా పోటీలు జరిగాయి. ఈ కాలంలోని మరో విశేషం ప్రహసనాల ఆవిర్భావం. నాటక ప్రదర్శనం మధ్యలో ప్రహసనాలను ప్రదర్శించడం ధార్వాడ నాటక సమాజంనుంచి వచ్చిన సంప్రదాయం. నాటక రంగాలను మార్పు చేసే సమయంలో సీనరీలను ఏర్పాటు చేసుకోవడం చేత ప్రేక్షకులను ఈలోపు వినోదపరచడానికి ప్రహసనాలు అవసరమయ్యాయి. 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు తెనాలిలో స్థాపించబడింది.ఇందులో ప్రదర్శించాలంటే ఐదేళ్ళ క్రితం రాసిన నాటకం పనికిరాదు. ఏటేటా పరిషత్తు వేర్వేరు పట్టణాల్లో జరగాలి. ఒక నటుడు ఒక నాటకం, నాటికలోనే పాల్గొనాలి. స్త్రీ పాత్రలు స్త్రీలే పోషించాలి. ఈ పరిషత్తు స్థాపన కొత్త రచయితల ఆవిర్భావానికి నాంది పలికింది. 1930 నుంచి సాంఘిక నాటకోద్యమం విజృభించింది. "విశ్వశాంతి", "ఎన్.జీ.ఓ.", "మా భూమి", "కీర్తిశేషులు", "నిర్మల" "కుక్క" వంటి నాటక రచనల ద్వారా రచయితలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

1935-44 మధ్య కాలంలో రేడియో రూపకం ఆవిర్భవించి అభివృద్ధి చెందింది. స్వాతంత్ర్యోద్యమానికి సమకాలికంగా సంఘ సంస్కరణోద్యమం కూడా దేశవ్యాప్తంగా సాగింది. సాంఘిక దురాచారాలను ఖండిస్తూ అనేక నాటకాలు వెలువడ్డాయి. వాటిలో కాళ్ళకూరి నారాయణరావు రచించిన "చింతామణి", "వరవిక్రయం", "మధుసేవ" సమస్యల ఆలంబనగా వెలసిన నాటకాలు. ఇలా వుండగా సంప్రదాయాల ఆధిక్యాన్ని రూపుమాపడం కోసం రచనలు చేసినవారు త్రిపురనేని రామస్వామి, ముద్దుకృష్ణ, చలం, ఆమంచర్ల గోపాలరావు మొదలగువారు. ఈ కాలంలో దువ్వూరి రామిరెడ్డి గారి "కుంభరాణా", విశ్వనాధ వారి "నర్తనశాల" ఉత్తమ విషాద రూపకాలు. 1930 తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన నాటకాలు కూడా వెలిశాయి. 1944-45 తరువాతి కాలాన్ని నాటక/నాటిక పోటీల యుగం అనవచ్చు. 1937 నుంచి రేడియో నాటికలు, 1944-45 నుంచి రంగస్థల ఏకాంకికలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. 1964లో ఎన్.ఆర్.నంది రచించిన "మరో మొహెంజొదారో" నాటకం ద్వారా తెలుగు నాటక ప్రయోగంలో "ఫ్రీజ్" ప్రవేశించింది.

ఆ తరువాత లెక్కలేనన్ని ప్రయోగాలు ఆధునిక నాటక రంగాన్ని వరించాయి. సాంఘిక నాటకాలలో లేజర్ టెక్నిక్‌ను వాడడం ద్వారా సైంటిఫిక్ పోకడలను సైతం గ్రహించి నాటకాలను ప్రదర్శిస్తున్నారు. నాటక ప్రక్రియలో పూర్వం నాటకాలు దేవుళ్ళు, దైవాంశసంభూతులు, దైవ ప్రతినిధులనబడే రాజుల గురించి మాత్రమే వుండేవి. ఆ స్థితి నుంచి సమాజంలోని జన బాహుళ్య సమస్యల గురించి పట్టించుకోని ఆలోచింపజేసే నాటకాలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే "నంది నాటకోత్సవాలు" ఆంధ్ర నాటక రంగానికి ప్రోత్సాహమిస్తూ ప్రపంచ రంగస్థల చరిత్రలో తెలుగు నాటక రంగ సర్వతోముఖ వికాసానికి దోహదపడుతూ ప్రపంచ ఖ్యాతిని తీసుకొస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్య తెలుగు వాడి ఆదరణ ఉన్నంతవరకు తెలుగు నాటక రంగం దేదీప్యమానంగా వెలుగుతందనడంలో సందేహం లేదు. నాటకాన్ని అమితంగా ఆదరించే తెలుగు ప్రజలకే ఈ ఖ్యాతి దక్కుతుంది.

శ్రీకాకులం జిల్లాలో నాటకరంగము :

శ్రీకాకులం జిల్లాలొ 2000 సం. వరకు సుమారు 20 సుప్రసిద్ధ నాటక కళాసమితిలుండేవి . ప్రస్తుతం ఇందులో పది (10) మాత్రమే పనిచేస్తున్నాయి . శ్రీకాకుళం లో -శ్రిశయనా ఆర్ట్స్ , కవిటి మండలం బొరివందలో -శర్వాణి ఫినె ఆర్ట్స్ , నందిగా మండలం పెద్దరామరాపల్లిలో - శ్రీవెంక్దటేశ్వర నాటక సమితి , టెక్కలి లో -శ్రీప్రజా చైతన్య కళాసమితి , కోటబొమ్మళి మండలం లఖిందిడ్డి లో - శ్రీనివాసా నాటక కళాసమితి , సంతబొమ్మళి మండలం ఒడ్డివడ ... తదితర గ్రామాల్లో నటక కళాసమితులు తమ ఉనికిని పాపుకొంటున్నాయి .

ఇటీవల శర్వాణి ఫైన్ఆర్ట్స్ కు నది అవార్డు లభించినది . శ్రీవెంకటేశ్వర నాటక కళాసమితి పెద్దతామారాపల్లి వారు నిర్వహించిన " కట్నాలు - కాపురాలు , కన్నీటి కాపురం , రధచక్రాలు , సింహాద్రిఅప్పన్నా కొండదిగిరా , దేవుడులేని దేవాలయలయం , ప్రచండభైరవి , ఈ చరిత్ర ఏ సిరాతో .." తదితర నాటకాలు జిల్లాలొ మంచి గుర్తింపు సాధంచాయి . టెక్కలి పర్జా చైతన్య కళాసమితి ద్వారా సామాజిక ప్రయోజనం కల్గించే ' ఎయిడ్స్ , నిరక్షరాస్యత నిర్మూలన , మూడనమ్మకాలు , బంధాలు బాంధవ్యాలు ... తదితర నాటకాలు వెలువడ్డాయి .

అంతరిస్తున్న కళాసమితులు : ప్రస్తుతం పట్టణాల్లో , గ్రామాల్లో గల నాటక కళాసమితులు అంతరిస్తున్నాయి . నటీమణులకొరత , టీవీ ల్లొ వస్తున్న డైలీ సీరియల్స్ , సినిమాలతో స్టేజి నాటకాలు కనుమరుగవుతున్నాయి . నాటకరంగానికి జీవతం అంకితం చేసిన కళాకారులకు జిల్లాలో కొదవలేదు . మేటి నటునిగా , అపర శివాజీగా పేరొందిన ' చట్టి పూర్ణయ్యపంతులు , అభినవ క్రుష్ణుడు గా బంగారు కిరీటాలు పొందిన -పీసపాటి , అమరపు సత్యం , 18 నంది పురస్కారాలు అందుకున్న -మీగడ రామలింగస్వామి , మీగడ మల్లిఖార్జునరావు , కోశిరెడ్డి రాజేశ్వరి , పిరియా చలపతిరావు , మోహనరావు , ముళ్ళపుడి రామచంద్రరావు , కె.కె.ఎల్. స్వామి , రాస్ట్రీయ నంది పురస్కారాలు అందుకొని చిక్కొలు నాటకరంగస్థలం కీర్తిని చాటి చెప్పారు .

ఉద్దానము లో నాటక కళ >
ఉద్దనం కళలకు పుట్టిల్లు .. 40 యేళ్ళు గా నాటక రంగం తో పరి చయమున్న ప్రాంతము . ఎంతోమంది కళాకారులు రాస్ట్రస్థాయిలోరాణించారు .ఈ ప్రాంతం లో నాటక రంగానికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎంపీపీ బెందళాం ప్రకాష్ . 1970 నుండి 1995 వరకు యువతకు శిక్షణ ఇప్పించి ఉత్తం నటులుగా తీర్చిదిద్దారు . ప్రకాష్ హుష్ కాకి , ఆగండి కొంచం ఆలోచించండి , మీరైతే ఏంచేస్తారు , సింహాద్రి అప్పన్న కొండదిగిరా , సమాధి కడుతున్నాం , చందాలివ్వండి , కల్లు , తదితర నాటికల్లో నాయకుడు , ప్రతినాయకుడి పాత్రలకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటుది అవార్డ్ గెలుచుకున్నారు . బల్లెడ మోహనరావు , సిరియా చలపతి , బుల్లెడ లక్ష్మణ రావు లు ఈ ప్రాంతానికి చెందినవారే .

శ్రీకాకులం జిల్లాకు చెందిన కొంతమంది ప్రముఖ కళాకారులు :
దివంగత రంగస్థల నటుడు మెట్ట అప్పరావు ,
మెట్ట పోలినాయుడు ,
ముళ్ళపూడి రమచంద్రరావు - జి.సిగడాం మండల్మలొని ఎస్.వి.అర్.పురం
బల్లెడ మోహనరావు - బి.గొనప పుట్టుగ ప్రాధమిక పాటశాలలొ ప్రధానోపాధ్యానునిగా పనిచేసారు .
పిరియా చలపతి - బి.గొనగపుట్తుక .
పెద్దింటి మోహనరావు - పాతపట్నం ,


  • ========================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .