Wednesday, February 2, 2011

దేశభక్తి దినోత్సవం , Patriotic Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 23) దేశభక్తి దినోత్సవం-- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.



దేశభక్తి దినోత్సవం :
దేశభక్తి అంటే ? :
దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సాంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి మరియు జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.

దేశభక్తి దినోత్సవంగా సుభాష్‌చంద్ర బోస్‌ జయంతి--ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకుగాను ఈ నెల 23న స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్‌చంద్ర బోస్‌ జయంతిని 'దేశభక్తి దినోత్సవం'గా పాటించాలని పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక్కడి ముజఫర్‌ అహ్మద్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశం అనంతరం లెఫ్ట్‌ఫ్రంట్‌ కేందానికి ఈ మేరకు సూచించింది. సుభాష్‌చంద్ర బోస్‌ జయంతిని దేశభక్తి దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్యకు లేఖలు రాయాలని నిర్ణయించినట్లు లెఫ్ట్‌ఫ్రంట్‌ ఛైర్మన్‌ బిమన్‌ బసు మీడియాకు తెలిపారు. ప్రతి ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నారని, అదేవిధంగా బోస్‌ జయంతిని దేశభక్తి దినోత్సవంగా పాటించాలన్నారు. సామాజిక దురాచారాలను రూపుమాపి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని వివేకానంద యువతను కోరారని అన్నారు. సుభాష్‌ చంద్ర బోస్‌ జీవితం, ఆయన రచనలకు సంబంధించి శాశ్వత ప్రదర్శనశాల ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజల్లో, యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు ఈనెల 23న స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌చంద్రబోస్‌ జయంతిని కేంద్ర ప్రభుత్వం 'దేశభక్తి దినోత్సవం'గా ప్రకటించి పాటించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి గండ్ర నవీన్‌ మంగళవారం నాడొక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నేటి అమెరికా పాశ్చాత్య సంస్కృతి మూలంగా ప్రధానంగా విద్యార్థులు, యువతలో దేశభక్తి భావాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. వీటి కల్పనకు ప్రభుత్వాలు వీరి చరిత్రలకు నామమాత్రంగా పుస్తకాల్లో స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో దేశభక్తి భావాల పెంపుకోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవటంతో యువతకు స్వాతంత్య్ర పోరాటాలు, దేశభక్తి గురించి అవగాహన లేకుండాపోయిందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నామని, అలాగే సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని కూడా దేశభక్తి దినోత్సవంగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆయన జయంతిని ప్రభుత్వమే ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని కోరారు.

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .