Sunday, February 28, 2010

ప్రపంచ జనాభా దినోత్సవం, World Population Day







ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్ల జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యత , ప్రాముఖ్యత ఉన్నది .

నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.

11-07- 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువలన నాటి నుండి జులై 11వ తేదీన ప్రపంచ జనా భా దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశా లైన ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదిక ప్రకారం ఈ శతాబ్ధానికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న రోజు "జూలై 11" కాబట్టి... ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇక అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జూలై 11వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ రోజునుంచి 20 సంవత్సరాల తరువాత జూలై 11, 2007లో చూస్తే ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకున్నట్లు ఐరాస వెల్లడించింది.

ఆ తరువాత... 2008 జూన్ 28 నాటికి ప్రపంచ జనాభా 6.7 బిలియన్ల వద్ద ఉండగా, 2012 నాటికి 7 బిలియన్లను చేరుకుంటుందని ఐరాస తెలిపింది. మరో యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా 9 బిలియన్లను చేరే అవకాశముందని కూడా సమితి పేర్కొంది. కాగా... అమెరికా 304 మిలియన్ల మంది జనాభాతో మూడో స్థానంలో ఉండగా... చైనా, భారత్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది.

తమ గణాంకాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.1 బిలియన్లకు చేరుకుంటుందని... అదేసమయంలో వచ్చే 50ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళల సంతానోత్పత్తి శాతం సరాసరిగా 2.5 నుంచి 2.1కి పడిపోతుందని తమ గణాంకాల్లో వెల్లడైందని సమితి తెలియజేసింది.
ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారి అంచనా ప్రకారం.. 1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ లోపే ఉంది. తరువాతి బిలియన్ పెరగడానికి 123 సంవత్సరాలు పట్టింది. ఐతే 33 సంవత్సరాలలోనే ఇంకో బిలియన్ పెరిగింది. ఇలా ఉన్నకొద్దీ వేగంగా పెరిగి ప్రస్తుత ప్రపంచ జనాభా 6 బిలియన్లపైనే ఉంది

ఇంతింతై వటుడింతింతై" అన్న చందంగా నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా ప్రకృతి వనరులు తరిగిపోతున్నా... వాటిని ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకునేందుకు, లేదా సహజ వనరుల్ని పొదుపుగా వాడుకునేందుకు ఎవరూ ప్రయత్నించటం లేదు. కాబట్టి ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకునేలా చేయాలి.
జనాభా ప్రరంగా టాప్ టెన్‌ :
దేశము ----------------------------------------------జనాభా కోట్లలో :
  1. చైనా-------------------------------------------------133.97.
  2. భారత్ (ఇండియా)----------------------------------121.01,
  3. అమెరికా -------------------------------------------31.16,
  4. ఇండోనేషియా--------------------------------------23.75,
  5. బ్రెజిల్ ---------------------------------------------19.07.
  6. పాకిస్తాన్‌------------------------------------------17.64,
  7. నైజేరియా ----------------------------------------15.84,
  8. బంగ్లాదేశ్ ----------------------------------------15.08 ,
  9. రష్యా--------------------------------------------14.29,
  10. జపాన్‌------------------------------------------12.79,
అతితక్కువ జనాభా గల పది దేశాలు :
దేశము -------------------------------------------- జనాభా .
  1. పిటికైర్న్ ద్వీపము --------------------------కేవలము 50 మంది ,
  2. వాటికన్‌ నగరము --------------------------500 ,
  3. టోకెలావ్ -----------------------------------1,100 ,
  4. నియు ------------------------------------1,500 ,
  5. పాక్ ల్యాండ్ ద్వీపాలు ---------------------3,000,
  6. సెయింట్ హెలెనా-------------------------4,000
  7. మోన్‌సెరాట్ -----------------------------6,000,
  8. నౌరు -----------------------------------10,000,
  9. ఫలౌ------------------------------------20,000,
  10. కుక్ ఐల్యాండ్స్ ------------------------23,400.
అలాగే.. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం, భూమిపై స్థలం సరిపోకపోవడం.. లాంటి సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయాలపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి, వాళ్లే వాలంటరీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికివారు జనాభా నియంత్రణకు పూనుకున్నట్లయితే భూమాత భారాన్ని కాస్తయినా తగ్గించినవారవుతాము

  • దేశాలవారీగా జనాభా పట్టిక ->world population
-------------------------------------------------------------------------------------------------

ప్రపంచ జనాభా దినోత్సవం 2010
--మూలము : ఈనాడు పేపరు - 11/07/2010
జనం... జనం... ప్రభంజనం! ఈ భూమ్మీద... వందకోట్ల మందికి... ఆహారం దొరకడం లేదు... 40 కోట్ల మందికి... పౌష్టికాహారం లేదు... ఏటా కోటి మందికి పైగా పిల్లలు... ఆకలితో చనిపోతున్నారు... దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా? జనాభా పెరుగుదల!
ఒక వూళ్లో ఓ పేదవాడుండే వాడు. అతను పూటకి ఓ రొట్టెను మాత్రమే సంపాదించేవాడు. రొట్టెలో సగం భార్యకిచ్చి, సగం తాను తినేవాడు. కొన్నాళ్లకి ఓ పాప పుట్టింది. ఆ రొట్టెనే మూడు భాగాలు చేసుకుని తినసాగారు. తర్వాత బాబు పుడితే, దాన్ని నాలుగు భాగాలు చేశారు. ఆపై మరో ఇద్దరు పుట్టేసరికి అదే రొట్టె ఆరు భాగాలైంది. దీంతో ఎవరికీ ఆకలి తీరని పరిస్థితి వచ్చింది. అంటే వాళ్లింట్లో జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు. ఇప్పుడు భూమి పరిస్థితి కూడా ఆ పేదవాడి ఇల్లు లాగే ఉంది. అవనిపై జనాభా కోట్లాదిగా పెరుగు పోతోంది. అందుకే చాలామందికి తిండి దొరకడం కష్టమై పోతోంది. కాబట్టి ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజే ఎందుకంటే, ప్రపంచ జనాభా 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది మరి!

  • * ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 6,831,200,000.
  • * ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోందన్న మాట.
  • * ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అయ్యే పరిస్థితి ఉందిప్పుడు.
  • * క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో ప్రపంచ జనాభా కేవలం 40 కోట్లు మాత్రమే.
  • * 1850లలో మొదటిసారి జనాభా వందకోట్లను దాటింది. అక్కణ్నించి కేవలం 150 ఏళ్ల కాలంలోనే 650 కోట్లను దాటేసింది. వచ్చే యాభై ఏళ్లలో 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
  • * ప్రతి రోజు 4,00,000 మంది పుడుతుంటే, 1,40,000 మంది చనిపోతున్నారు.
  • * ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం మంది అంటే మూడు వందల కోట్ల ఎనభై లక్షల మంది నివసిస్తున్నారు. ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.
  • * మన దేశం విషయానికి వస్తే 1750లో జనాభా పన్నెండున్నర కోట్లు మాత్రమే ఉండేది. 1941 కల్లా 38.9 కోట్లు అయ్యింది. అదే ఇప్పుడు 112 కోట్లు అయ్యింది.
  • * అయిదున్నర అడుగులుండే మనుషులు సుమారు 22,93,02,720 మంది ఒకరిపై ఒకరు నిలుచుంటే చంద్రుణ్ని చేరుకోగలరు. ఇలా భూమిపై ఉండే మొత్తం జనాభాతో 29 సార్లు చందమామపైకి నిచ్చెన వేసెయచ్చు.


-----------------------------------------------------------------------------------------------
నేడు జనాభా దినోత్సవం
- టంగుటూరి శ్రీరాం, July 10th, 2011--Andhraprabha News paper.

ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. భూ మండలంలో మానవజాతి అతి వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాభా నియంత్రణ, స్థిరీకరణ లాంటి అనేక విషయాలపై జనంలో అవగాహన పెంచడం, చైతన్యం తీసుకురావడం ఈఉత్సవ ముఖ్యోద్దేశం. జగత్తులోని జీవరాసులలోకెల్లా మానవజాతి అత్యంత తెలివైనది. మానవుడు తను జీవించడానికి ప్రకృతి సిద్ధమైన వనరులను, భూ, జల సంపదను వాడినంతగా ఈ జగత్తులో మరే ప్రాణి వాడదు అన్నది కూడా జగమెరిగిన సత్యం. అంతేకాదు మానవజాతి తన మనుగడ కోసం, అవసరాల కోసం, విలాసాల కోసం ఇతర ప్రాణులను కూడా సహజ వనరులతోపాటు సమూహంగా నాశనం చేయగలదు. మానవుడు తన అవసరాలు, విలాసాల కోసం అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఈ పరివర్తన వెనుక ప్రకృతి వనరుల నిర్మూలనలు, పశు, పక్ష, వృక్ష జాతి వినాశనలు, బలిదానాలు దాగి ఉన్నాయి అన్న నగ్నసత్యాన్ని విస్మరించకూడదు. జనాభాకు, పర్యావరణానికి ప్రత్యేక సంబంధం ఉన్నది.
విశ్వంలో మూడొంతులు నీరు ఉంటే ఒక వంతు భూమి ఉంది. జనాభా ఇంతై... ఇంతింతై... అన్నట్లుగా పెరిగిపోతే జగమంతా జనమయమైతే ఏం జరుగుతుంది? భూమాత భారం ఎంతని మోస్తుంది? పర్యావరణ, వాతావరణ, వనరుల స్థితిగతులు ఏవౌతాయి? ప్రజల జీవన ప్రమాణాల పయనం ఎలాగుంటుంది? అంతా అగమ్యగోచరం. ప్రమాదకరం. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అధిక జనాభావల్ల కలిగే దుష్ఫలితాల నివారణ పథకాలు, దిద్దుబాటు చర్యలు, కట్టుబాట్లను కనుగొనాలి. ఈ ఆలోచనలు ప్రపంచ గణాంక శాస్తవ్రేత్తలను, జనాభా నియంత్రణ నిపుణులను సుమారు అర్ధశతాబ్దం క్రితమే జాగరూకల్ని చేసాయి. అప్పటి నుంచి ప్రపంచ జనాభాను కట్టుదిట్టం చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలని ప్రపంచ దేశాలలో చర్యలు మొదలైనాయి.
హద్దూ, అదుపులేకుండా పెరిగే ప్రపంచ జనాభాను పరిశీలిస్తే ఎంతటి ప్రమాద స్థాయికి చేరుకుందో బోధపడుతుంది. ప్రపంచ జనాభా ప్రస్తుతము 692, 94,00,000. మరో యాబయ ఏళ్ళకు 900కోట్లు దాటిపోవచ్చునని ఐక్యరాజ్యసమితి వక్కాణిస్తోంది. క్రీస్తు శకం 1800 నాటి కి ప్రపంచ జనాభా వందకోట్ల లోపే ఉండింది. మరో వందకోట్ల జనాభా పెరగడానికి 123 ఏళ్ళు పట్టింది. 1900-1960 మధ్య కాలంలో ప్రపంచ జనాభా పెరుగుదల రెట్టింపుకు తక్కువగా నమోదైతే 1960-2000 మధ్య కాలంలో అంటె కేవలం 40 ఏళ్ళకే జనాభా రెట్టింపు అయి 3,04 కోట్లకు చేరుకుంది. అతివేగంగా జనాభా పెరుగుతూ పోతే అనేక సమస్యలు ఉద్భవిస్తాయి. 1987 జూలై 11 రోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐ.రా.స. పాలక మండలి ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. తరువాత 1989 సంవత్సరం నుండి ఐ.రా.స. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగను జరుపుతున్నది. జనాభా అతిగా పెరగడం వలన కలిగే దుష్ఫలితాలు, వాటి నివారణ, జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ పథకాల రచన, మానవత నూతన సూత్రాల రూపకల్పన ఈనాటి లక్ష్యాలు. వీటిని ప్రజలలోకి తీసుకొనివెళ్ళి, వారిని చైతన్యవంతులుగా చేయడం కూడా ఒక బాధ్యతగా స్వీకరించింది. 1995 నుంచి 2000 మధ్య కాలంలో ప్రతి ఏడాది 7.8 కోట్ల మంది చొప్పున జనాభా పెరిగింది. శాస్ర్తియ, సాంకేతిక రంగాలలో గణీయమైన అభివృద్ధి, ఆహార పదార్థాల ఉత్పత్తితోపాటు మరణాల రేటు తగ్గిపోవడం ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలుగా పరిశోధకులు తేల్చారు. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఒకటుంది. జనాభా పెరుగుదల ఆహార పదార్థాల ఉత్పత్తి పెరుగుదలకంటే చాలా ఎక్కువగా ఉంటోంది. అందువల్ల డిమాండ్ అధికంగా పెరిగి సప్లై తగ్గుమొహం పట్టడంతో ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్ ,సప్లై ల మధ్య అగాధం పెరిగిపోతోంది. పర్యవసానంగా ఉన్నవాడు కొనుక్కో గలుగుతున్నాడు. లేనివాడు ఆకలికి గురి అవుతున్నాడు. కనుక ప్రపంచంలో అనేకచోట్ల ఆకలిచావులు సంభవిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలలో సంభవించే లక్షల ఆకలిచావులే దీనికి సాక్షీ భూతాలు. ప్రకృతి వనరులకు సహజ సంపదలకు, జల, భూ వనరులకు ఒక పరిమితి ఉంది. అవి ఒక పరిమితికి మించని జనాభా అవసరాలకు మాత్రమే ఉపకరించబడతాయి. ఆ పరిమితికి మించి జనాభా ఉంటే నిరుపయోగ స్థాయికి చేరుకుంటాయి. పైగా మితిమీరిన సేద్యం, వినియోగం, దుర్వినియోగం వలన భూసారం తగ్గి తరుగుదల కాలుష్యం చోటు చేసుకుంటాయి. సంపదలు సరిపోవు. పనికిరావు. ఆపైన దారిద్య్రము, ప్రకృతి వైపరీత్యాలతోపాటు ఒకరినొకరు దోచుకోవడాలు, మోసాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు చోటు చేసుకుంటాయి. సమాజం అదుపు తప్పుతుంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా గడియారం ప్రకారం ప్రతి సెకనుకూ ఐదుగురు పుడుతున్నారు. ఇద్దరు చనిపోతున్నారు. అంటే ప్రపంచంలో భూమిమీద ప్రస్తుతం ఒక సెకెండుకు సగటున ముగ్గురు పెరుగుతున్నారన్నమాట. ఇంకా లోతుగా పరికిస్తే నిమిషయానికి 180 మంది, గంటకు 10,800 మంది, రోజుకు 2,59,200 మంది ప్రతి ఏడాదికి 9,46,08,000 పెరిగిపోతున్నారు. మరో పక్క భూ సంపద క్షీణిస్తున్నది.
గతమార్చి 1వ తేదీ నాటికి మన దేశ జనాభా 121,01,99,422. అందులో పురుషులు సుమారు 62 కోట్లు కాగా, స్ర్తిలు సుమారు 58 కోట్ల పైచిలుకు మాటే. ఇంకో వాస్తవము గత పదేళ్ళ కాలంలో మన దేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది. మన దేశ జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రిజెల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాతో సమానం. మన దేశం జనాభా పెరుగుదల ఇదే రీతిలో కొనసాగితే 2025 నాటికల్లా భారత్ చైనాను అధిగమించి ప్రపంచఒంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఆవిర్భవించడం తథ్యం అని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. సత్వరమే భారత్ దిద్దుబాటు చర్యలు, జనస్థిరీకరణ, నియంత్రణకు పూనుకవాలి. లేదా ఆఫ్రికా దేశాల మాదిరి ఆకలి, దారిద్య్రము, కరువు రక్కసులు పడగలిప్పడం అనివార్యం అనడంలో మరో మాట లేదు.
ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టిన దేశం మన దేశమే. 1950లోనే కుటుంబ నియంత్రణ కొరకై నూతన సూత్రీకరణాలను చేసి లక్షలు, కోట్లు ఖర్చు చేసింది. అయినా ఆశించిన ఫలితాలు సాధించలేక పోయినాము. కారణాలు అనేకం కావచ్చును. ముఖ్యమైనవిగా పేర్కొనాల్సినవి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం. ప్రభుత్వ పథకాలలో అవకతవకలు, పారదర్శకత లోపించడం, మూఢనమ్మకాలు, అవిద్య, స్ర్తి సాధికారిత లేకపోవడం. ఇదే విషయంలో 1976లో భారత్‌లో (పాపులేషన్ కంట్రోల్ పాలసి) జనాభా నియంత్రణ పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీనివల్ల జనాభాను మన ఆర్థిక రంగానికి అనుగుణంగా అన్ని కోణాలలో తీర్చి దిద్దడం. ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడం, జన జీవన శైలిని, ప్రమాణాలను వృద్ధి పర్చడం జరిగింది. ఈ భూమీద వందకోట్ల మందికి పౌష్టికాహారం దొరకడం లేదు. 40 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని అధిక జనాభాగల దేశాలు తక్షణమే తీసుకోవలసిన జాగ్రత్తలివి. ప్రజలు మూఢనమ్మకాలను వీడి, కులాలకు, మతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణ పథకాలను ఆచరించాలి. ‘ఒక బిడ్డ ముద్దు - రెండోది వద్దు’ అన్న నినాదం అక్షర సత్యాన్ని చేయాలి. స్ర్తి సాధికారిత పెంచాలి. స్ర్తి విద్యను పోషించాలి. స్ర్తి విద్యావంతురాలైతే సమాజం ఉన్నతస్థాయికి చేరడం ఖాయం. ముఖ్యంగా యువతరం నడుం కట్టాలి. జనాభాను అదుపుచేసి విద్యావ్యాప్తి చేసి ప్రతి ఒక్కరు మానవ బాంబుగా కాక మానవ వనరుగా మారిన రోజున దేశభ్యుదయానికి వందకోట్ల మార్గాలున్నాయి అనడంలో అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు.
జన స్థిరీకరణ, నియంత్రణ, ప్రస్తుత ఆర్థిక రంగానికి అనుసంధానం చేస్తే జన జీవనజ్యోతి దేదీపమాన్యంగా వెలుగుతుంది. భూమాత భారం తగ్గుతుంది. పర్యావరణ నిపుణుల ప్రకారం జనాభా పెరుగుదలను తగ్గించకుంటే ప్రకృతే ఆ పనిని సమూలంగా చేపడ్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు లాంటి బీభత్సాలతో అధిక భారాన్ని భూమాతే తక్కువ చేసుకుంటుంది. కనుక జనాభా నియంత్రణ మన అందరి కర్తవ్యం.


  • ==================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .